అమరావతి : ఏపీలో కరోనా కలవరం రేపుతుంది. కడప రిమ్స్ వైద్య కళాశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది. రేపు(మంగళవారం) ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాయాల్సి ఉండగా అధికారుల ఆదేశాల మేరకు 150 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 50 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. మరికొందరు నివేదికలు రావాల్సి ఉంది. అయితే ఈ పరిస్థితిలో పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్టీఆర్ వర్సిటీ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు జరుగునున్న ఫైనల్ పరీక్షల వాయిదా ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రంలో వారం రోజుల్లోనే పాజిటివిటీ రేటు 11 శాతంపైగా వృద్ధి చెందింది. ఈనెల పదో తేదీన 4.05% ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.22 శాతానికి చేరడం కరోనా విజృంభణ ఏ మేరకు ఉందో తెలియజేస్తుంది .