కాకినాడ: తూర్పు గోదావరిలో ఆశావర్కర్లు, పోలీసుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. ఆశా వర్కర్లు, మహిళా పోలీసుల మధ్య వ్యవహారం రచ్చకెక్కింది. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టిన తమ పట్ల పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించారంటూ ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ జట్టు పట్టి లాగి కొట్టారని మహిళా పోలీసులు విరుచుకుపడుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా కేంద్రంలో న్యాయమైన తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా రోడ్డెక్కిన తమ పట్ల పోలీసులు, హోంగార్డులు చాలా దారుణంగా వ్యవహరించారని ఆశా వర్కర్లు వాపోయారు. మహిళా పోలీసులు తీరును నిరసిస్తూ ఆశా వర్కర్లు జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. తమపై దాడి చేసి కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అయితే, ఆశా వర్కర్ల ఆరోపణలను మహిళా పోలీసులు కొట్టిపారేస్తున్నారు. విధుల్లో భాగంగానే తాము వారిని తప్పించామని, మా గోడు కనిపించకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. చాలా మంది తమ జుట్టు పట్టుకుని లాగారని, చున్నీలు లాగారని వారు ఆరోపించారు. దీంతో వ్యవహారం కాస్తా.. ఆశా వర్కర్లు-మహిళా సిబ్బంది మధ్య గొడవగా మారింది.