అమరావతి: వర్షాకాలం భారీవర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు అప్రమత్తమైంది. ఇవాళ రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో ఏపీలోని విపత్తుల నిర్వహణ సంస్థ సమాయత్తమైంది. స్టేట్ కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి అధికారులను అందుబాటులో ఉంచింది.
రానున్న రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుకానున్నాయి. భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని వారు సహాయం కోసం కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ సెంటర్లో 1070 , 18004250101, 08632377118 ఫోన్ నంబర్లలో అధికారులు అందుబాటులో ఉంటారు. వరదల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.