తిరుపతి : తిరుమల శ్రీవాణి ట్రస్టు ద్వారా వివిధ ప్రాంతాల్లో 320 భజన మందిరాలు నిర్మించనున్నట్టు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి 84 భజన మందిరాల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. సమరసత ఫౌండేషన్ నేతృత్వంలో రెండో విడత 111, మూడో విడతలో 209 భజన మందిరాల నిర్మాణపనులను అడిగి తెలుసుకున్నారు.
రెండో విడతకు సంబంధించి 84 భజన మందిరాల పనులు జరుగుతున్నాయని, మిగిలినవి డాక్యుమెంటేషన్ స్థితిలోనే ఉన్నాయని, వీటి పనులు వేగవంతం చేయాలని సూచించారు. మూడో విడతలోని 209 భజన మందిరాల స్థల సేకరణ పనులు పూర్తి చేసి వాటి నిర్మాణపనులు కూడా ప్రారంభించాలన్నారు.
రెండో విడతలో పూర్తికానున్న 111 భజన మందిరాలకు విగ్రహాలను సిద్ధం చేయాలని సీఈని ఆదేశించారు. వీటిలో అర్చకులుగా పనిచేయబోయేవారికి శ్వేతలో అర్చక శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వీటికి ధూపదీప నైవేద్యాల కోసం టీటీడీ సహకారం అందిస్తుందని చెప్పారు.
,