Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానది వరద నిలకడగా వస్తూనే ఉన్నది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తున్నది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి మంగళవారం వరకు నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. బుధవారం తెల్లవారుజాము నుంచి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం నుంచి శ్రీశైలం రిజర్వాయర్ పది గేట్లను పది అడుగుల ఎత్తున తెరిచి నీటి ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు.
ఇప్పటివరకు జూరాల నుంచి 2,14,135 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 26,464 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 58,832 క్యూసెక్కుల నీరు శ్రీశైలం రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నది. బుధవారం సాయంత్రం వరకు 3,75,789 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా పది గేట్లను 10 అడుగుల మేర ఎత్తులో తెరచి 2,75,700, కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 62,914 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు 883.90 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వలు 215.80 టీఏంసీలకు 209.59 టీఏంసీలుగా నమోదైంది.