అమరావతి : కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్య ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని , కారకులైన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు రహదారిపై శవాన్ని ఉంచి వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు అరవింద్ అనే యువకుడిన స్టేషన్కు పిలిచి విచారణ అనంతరం ఇంటికి పంపించారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండానే స్టేషన్కు పిలిచి అవమానకరంగా మాట్లాడారని,తనపై చేయి చేసుకున్నారని ఈ అవమానాన్ని భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో అరవింద్ పేర్కొన్నాడు. గత ఆరు సంవత్సరాల క్రితం పిన్నితో ఇద్దరు కానిస్టేబుళ్లు సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన తాను ఈ విషయాన్ని బాబాయికి, అతడి కొడుకుకు సమాచారం ఇచ్చినందుకు తనపై, తన కుటుంబ సభ్యులపై కక్ష గట్టిందని ఆ లేఖలో పేర్కొన్నాడు.
పోలీసులు ఆమెతో కుమ్మకై బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడిని స్టేషన్కు పిలిపించి కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అరవింద్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.