తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ కేంద్రాల సంఖ్యను కుదించారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన తొమ్మిది కేంద్రాల్లో రోజువారిగా టోకెన్లు గత నెల 31 నుంచి జారీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
అయితే బుధవారం నుంచి నాలుగు కేంద్రాల్లో మాత్రమే ఈ టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల 2వ సత్రం (గోవిందరాజస్వామి సత్రాలు )కేంద్రాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. . భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 71,924 మంది భక్తులు దర్శించుకోగా,15,771 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.