అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పీఆర్సీ అమలు అంశంపై సీఎం జగన్తో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమయ్యింది . ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఎస్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు గత కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. నేటి నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ ప్రారంభించారు. ఎల్లుండి నుంచి సమ్మెబాట పట్టనుండడంతో సమస్యను మరింత జటిలం చేయకుండా నిన్న సీఎం ఆదేశాల మేరకు మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి నాయకులతో రాత్రి7 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు చర్చలు జరిపారు.
ఈ చర్చలో ఇరువర్గాలు సూచించిన విధంగా తయారు చేసిన నివేదికపై ఈ రోజు మంత్రుల కమిటీ సీఎం జగన్తో సమావేశం అయ్యింది. పీఆర్సీలో కొన్ని సవరణలు చేయడానికి సీఎం సుముఖత వ్యక్తం చేయడంతో మధ్యాహ్నం మరోమారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం కానున్నది. సీఎం వద్ద జరిగిన చర్చల సారాంశాన్ని పీఆర్సీ సాధన సమితి నాయకులకు వివరించిన అనంతరం సీఎంతో సమావేశం కానున్నారు.