తిరుపతి : తిరుపతి(Tirupati) గోవిందరాజస్వామివారి (Govindarajaswamy )ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు.
యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునిక్రిష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.