శ్రీశైలం : ఓం నమ:శివాయ అంటూ శివమండల దీక్షను చేపట్టిన శివ భక్తుల కోసం శ్రీశైల (Srisailam) క్షేత్రంలో దీక్షా విరమణ ఏర్పాట్లను బుధవారం నుంచి ప్రారంభించారు. ఈ నెల 28 నుంచి మార్చి 13వ తేదీ వరకు దీక్షా విరమణ(Jyotirmudi Deeksha) ను చేసుకోవచ్చని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
జనవరి 29న ప్రారంభమైన శివమండల దీక్ష, ఫిబ్రవరి 19న ప్రారంభమైన అర్థ మండల దీక్షను స్వీకరించిన భక్తులకు శ్రీశైలం సన్నిధి మనోహర గుండం వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతిర్ముడి కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
శివదీక్షను స్వీకరించన భక్తులకు చంద్రవతి కల్యాణ మండపం నుంచి ఆలయ తూర్పు మాడవీధి ద్వారా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు సేవలందించేందుకు మూడు వంతులుగా సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించమని కార్యనిర్వహాణాధికారి పెద్దిరెడ్డి తెలిపారు.