తిరుమల : తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టీటీడీ గురువారం నుంచి జీడిపప్పును బద్దలుగా మార్చే సేవను ప్రారంభించింది. శ్రీవారి సేవా సదన్ -2లో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ఈ సేవను ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీ కోసం టీటీడీ సాధారణంగా టెండర్ల ద్వారా జీడిపప్పును కొనుగోలు చేస్తుందన్నారు. జీడిపప్పు బద్దలు తగినంత మొత్తంలో లభించకపోవడంతో మార్చి 21న తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్లో శ్రీవారి సేవకులతో జీడిపప్పు బద్దల సేవను ప్రారంభించామని తెలిపారు.
గత 52 రోజుల్లో శ్రీవారి సేవకులు 26 వేల కిలోల జీడిపప్పును బద్దలుగా మార్చారని చెప్పారు. రోజుకు 100 మంది చొప్పున ఇప్పటివరకు తిరుపతిలో 5200 మంది సేవకులు ఈ సేవలో పాల్గొన్నారని తెలిపారు. తిరుమలలో ప్రతి రోజు ప్రసాదాల తయారీకి 3500 కిలోల నుంచి 4000 కిలోల వరకు జీడిపప్పు బద్దలు అవసరమవుతాయని చెప్పారు.
విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో పలు సంస్థలు జీడిపప్పును బద్దలుగా మార్చే యంత్రాలను తయారు చేస్తున్నాయని, ట్రయల్ రన్ కూడా జరిగిందని తెలిపారు. ఈ యంత్రాలు బాగా పనిచేస్తే కొనుగోలు చేస్తామన్నారు. అప్పటి వరకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.