అమరావతి : జమ్ముకశ్మీర్ లోయలో పడ్డ జవాన్ల బస్సు దుర్ఘటనలో మరణించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ రాజశేఖర్ భౌతికకాయం ఇవాళ స్వస్థలానికి చేరుకుంది. మంగళవారం అమర్నాథ్ యాత్ర విధులు ముగించుకున్న ఇండో- టిబెటన్ జవాన్లు బస్సులో తిరిగి వెళ్తుండగా 60 మీటర్ల లోతు లోయలో పడి 7 గురు జవాన్లు చనిపోయారు. మరో 36 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏపీకి చెంఇన జవాన్ రాజశేఖర్ భౌతికకాయం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం దేవపట్ల గ్రామానికి చేరుకుంది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫకీరప్ప జవాన్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం దేవపట్ల నుంచి సంబేపల్లి పీఎస్ వరకు అంతిమ యాత్రను నిర్వహించారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక యువకులు, గ్రామస్థులు జవాన్ అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు.