Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ముందుగా వచ్చే రోజు) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారికి సాత్విక బలి నిర్వహణకు (కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. మంగళవారం (2024, మార్చి 26) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందు అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలు రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాదికాలు జరిపించారు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగిందని శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు చెప్పారు.