అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విశ్వమంతటా అభిమానులు ఉన్నారు. ఈరోజు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు వేడుకలను ఘనంగా జరుపు కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సైతం కేసీఆర్కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు.
రైతు బాంధవుడిగా తెలంగాణ రైతులకు విశిష్ట సేవలందిస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు తూర్పు గోదావరి జిల్లా కడియం రైతులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కడియపులంక గ్రీన్ లైఫ్ నర్సరీలో కూరగాయలు, మొక్కలు, పువ్పులతో సీఎం కేసీఆర్ చిత్రాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కోటి మొక్కల కార్యక్రమం కోసం కడియం నర్సరీల నుంచి తెలంగాణ ప్రభుత్వం మొక్కలను తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కేసీఆర్ బర్త్డే వేడుకలను నిర్వహించారు.