తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. ఇటీవలే రాజధానిలో పర్యటించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి వినతులు అందజేశారు. తాజాగా మరోసారి రేపు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఏపీ భవన్లో బస చేయనున్నారు. ఈ విషయాలను ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.
మరుసటిరోజు ఏప్రిల్ 30న జరిగే జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా పాల్గొంటారు. న్యాయ, కేసుల సత్వర పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చించనున్నారు. అనంతరం సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో విశాఖ పాలనా రాజధాని అంశాన్ని జగన్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా పార్టీవర్గాల ద్వారా తెలుస్తున్నది.