అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల థృక్పధంతో ఉన్నదనే సూచన చేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేస్తున్నదనే విషయాలను జగన్ వెల్లడించారు. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉదయం స్పందన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగులు, అధికారులతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం ఏం చేసిందనే నాలుగు కీలక అంశాలను పునరుద్ఘాటించారు. ఆందోళన, అంసతృప్తితో ఉన్న ఉద్యోగులు.. తమ కోసం ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలుసుకుని కోపం తగ్గించుకునేందుకు ముఖ్యమంత్రి ప్రకటన ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.
పీఆర్సీ అమలుతోపాటు ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామని, కొవిడ్ కారణంగా మరణించిన ఫ్రంట్ లైన్ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగులు ఇవ్వాలని ఇప్పటికే చెప్పినట్లు జగన్ తెలిపారు. యుద్ధప్రాతిపదికన వారికి ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలని సూచించారు. జూన్ 30 లోగా కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గతంలో హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వం చేపడుతున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్లలో 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించామని తెలిపారు. ఉద్యోగులే కాకుండా స్థలాలు కోరుతున్న వారి పేర్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. అప్పుడే ఎంత స్థలం డిమాండ్ ఉన్నది, ఎంత సేకరించాలి అనే దానిపై స్పష్టత వస్తుందని, వేగంగా పూర్తి చేయాలని జగన్ సూచించారు. అలాగే, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 కు పెంచే విషయాన్ని కూడా వెంటనే ఆచరణలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ను జూన్ 30 లో పూర్తి చేసి జూలై నెల ఒకటో తేదీ నుంచి వీరికి కొత్త జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ముఖ్యమంత్రి స్పందనపై ఉద్యోగ సంఘాల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూద్దాం.