అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. శాసనసభలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన, మెరుగైన బిల్లుతో మళ్లీ సభ ముందుకు వస్తామన్నారు. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని జగన్ స్పష్టం చేశారు.
శాసనసభలో సీఎం జగన్ ప్రకటన.. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా, మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాన్నుంచి మంచి ఫలితాలు ఈపాటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఒకచోటే పూర్తిగా కేంద్రీకరణ అయిన పరిస్థితుల మధ్య ప్రజలు వ్యతిరేకించడమనేది… 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని అటువంటి చారిత్రక తప్పిదాన్ని ప్రభుత్వం పాల్పడరాదని ప్రజలు తీర్పులో స్పష్టం చేశారు. కాబట్టి వికేంద్రీకరణ సరైన విధానమన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం. అన్ని ప్రాంతాలు కులాలు, మతాలు.. వీరిందరి ఆశలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని, మన ప్రభుత్వాన్ని రెండున్నర సంవత్సరాలు మనసారరా దీవిస్తూ వచ్చారు. ప్రతి ఎన్నికలోనూ మన పార్టీని ఆశీర్వదించారు.
అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహాలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలను ఈ రెండేళ్ల కాలంలో ప్రచారం చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందనే వాదనను ముందుకు తోశారు. అది అందరూ కళ్లతో చూశారు. వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలతో బిల్లులోనే పొందుపరించేందుకు, బిల్లులను మరింత మెరుగుపరిచేందుకు అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతుకు ముందు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని మళ్లీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని సీఎం జగన్ పేర్కొన్నారు.