నెల్లూరు : జిల్లావాసుల దశాబ్దాల స్వప్నం నెరవేరింది. జిల్లాలో పెన్నా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బరాజ్ను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అలాగే, సంగం బరాజ్ వంతెనను కూడా ప్రారంభించారు. బరాజ్ వద్ద ఏర్పాటుచేసిన వైఎస్సార్, గౌతమ్రెడ్డిల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఈ బరాజ్ ప్రారంభంతో దాదాపు 3.85 లక్షల ఎకరాలను సాగు నీరు అందనున్నది.
నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. ఇవాళ ఉదయం మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బరాజ్ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబసభ్యులు, పలువురు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య జగన్ కొబ్బరికాయ కొట్టి బరాజ్ను ప్రారంభించారు. అనంతరం పెన్నానదికి హారతినిచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2006 మే 28న సంగం బరాజ్ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2008 లో పనులు ప్రారంభమై.. శరవేగంగా కొనసాగిన పనులు వైఎస్సార్ హఠాన్మరణంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ బరాజ్ పనులు నత్తనడకన సాగాయి.
సంగం బరాజ్ ప్రారంభంతో పెన్నాడెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు మార్గం ఏర్పడింది. నెల్లూరు బ్యారేజీ ద్వారా సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. అలాగే ఈ బరాజ్ అందుబాటులోకి రావడంతో సాగు, తాగునీటితోపాటు రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లయింది. బరాజ్ల ద్వారా వరదను సమర్థంగా నియంత్రించి ముంపు ముప్పు తప్పించేలా మార్గం సుగమం చేసినట్లయింది.