గుంటూరు: కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. జడ్జిలు కేసుల సంఖ్య కంటే తీర్పుల నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఖాజాలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తదనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించారు.
కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని సీజేఐ అన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని వెల్లడించారు. జడ్జిలకు సొంత సామర్థ్యాలపై విశ్వాసం ఉండాలని చెప్పారు. న్యాయమూర్తులు నిత్యవిద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవరం ఉదన్నారు. న్యాయవాదులు నల్లకోటు ధరించి తిరగడం మనం చూస్తుంటాం.. అందులోని తెలుపు, నలుపు రంగులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణగా పరిగణిస్తారని చెప్పారు. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరమని తెలిపారు.