తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సీజేఐ కుటుంబసభ్యులు వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీపద్మావతి అతిథిగృహంలో టీటీడీ ఏర్పాటు చేసిన 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ సాంకేతికతతో రూపొందించిన శ్రీవారి చిత్రాల స్టాల్ను పరిశీలించారు.
అంతకు ముందు అలిపిరిలోని శ్రీ వేంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని సీజేఐ దంపతులు దర్శించుకున్నారు.శ్రీ వేణుగోపాలస్వామిని దర్శించుకుని గో తులాభారం వద్దకు చేరుకుని గోమాతకు సరిపడా తులాభారంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు రాజేశ్ కుమార్ గోయల్, ప్రశాంత్ కుమార్ సూర్యదేవర, హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్, రిజిస్ట్రార్ వెంకటరమణ, రవీంద్రబాబు, జిల్లా జడ్జి పార్థసారథి, మూడో అదనపు జిల్లా జడ్జి వీర్రాజు ఉన్నారు.
తిరుమల శ్రీవారిని మరి కొందరు ప్రముఖులు, సినీ నటులు దర్శించుకున్నారు. సినీనటులు జాన్వీ కపూర్, మహేశ్వరి ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, ఎమ్మెల్సీ రామారావు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.