విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (Chandrababu Naidu) సీఐడీ (CID) రిమాండ్ రిపోర్టులో (Remand Report) సంచలన అభియోగాలు చేసింది. స్కిల్ స్కామ్లో (Skill Development scam) చంద్రబాబుకు (Chandrababu) పూర్తి అవగాహన ఉందని పేర్కొంది. నిందితులతో కలిసి చంద్రబాబే కుట్రకు సూత్రధారి అని తెలిపింది. ఆయన ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని వెల్లడించింది. టీడీపీ నేత ఇల్లందుల రమేశ్ ద్వారా డిజైన్టెక్ (Designtech), సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబును కలిశారని తెలిపింది. రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్ పేరును కూడా జతచేసింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్ ద్వారా లోకేశ్కు డబ్బులు అందినట్లు అందులో పేర్కొంది. ఇంకా అందులో ఏముందంటే.. ‘కేబినెట్ తీర్మానాలను పక్కనపెట్టి గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ లాంటి అధికారుల ద్వారా బాబు కుట్రకు పాల్పడ్డారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేశారు. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన పవర్పాయింట్ ప్రజంటేషన్ల ఆధారంగానే ప్రాజెక్టును ఆమోదించారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించి మార్కెట్ సర్వే జరుగలేదు. ఎలాంటి ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే సీమెన్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ఆధారంగా రూ.3,281 కోట్ల బడ్జెట్ను కేబినెట్ ముందు పెట్టారు. దీనికి సంబంధించిన నోట్ ఫైల్ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్రూవ్ చేశారు. 98 శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని కేబినెట్కు అబద్ధాలు చెప్పారు.
ఎలాంటి ఫర్ఫార్మెన్స్, బ్యాంకు గ్యారెంటీ లేకుండానే ప్రభుత్వం రూ.371 కోట్లను డిజైన్టెక్కు ఇచ్చేసింది. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కే.సునీత అభ్యంతరాలను పట్టించుకోలేదు. అప్పటి సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యాయి. పలు షెల్ కంపెనీల ద్వారా డిజైన్టెక్ కంపెనీ రూ.279 కోట్లు దారిమళ్లించింది. జీవో నం.4ను ఆర్థిక శాఖ అభ్యంతరాలను అతిక్రమించి చంద్రబాబు ఈ కుట్రలో కీలక భాగస్వామి అయ్యారు. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడానికి చంద్రబాబు, అచ్చెన్నాయుడు కుట్రే కారణం. కుట్రపై జీఎస్టీ విచారణ మొదలవగానే.. నిందితులు నోట్ఫైల్స్ మాయం చేశారు. కేబినెట్లో అత్యవసర ఐటమ్ కింద పెట్టి ప్రపోజల్ను ఆమోదించారు’ అని 28 పేజీల రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సిట్ సమర్పించింది.