Margadarsi: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ (Margadarsi chit funds) కార్యాలయాల్లో సీఐడీ (CID) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో (Vijayawada) సంస్థ మేనేజర్ శ్రీనివాస్ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
నెల రోజుల క్రితం హైదరాబాద్లోని మార్గదర్శి కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఛిట్ ఫండ్ సంస్థల్లో సోదాలు చేసారు. ఈ సందర్భంగా మార్గదర్శి సంస్థల్లో చేసిన తనిఖీల్లో అక్రమాలు బయటకు వచ్చాయని అధికారులు వెల్లడించారు. చిట్ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బును దారి మళ్లిస్తున్నట్టు తేల్చారు. ఆ డబ్బును వడ్డీలకు ఇవ్వడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి పాల్పడినట్టు నిర్ధారించారు. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.