Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళి పండుగకు ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
చిత్తూరు జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా పెన్షన్లు పెంచాలి.. రేషన్ కార్డులు ఇవ్వాలి.. ఎన్టీఆర్ గృహాలు ఇవ్వాలి.. ఇంకా ఎన్నో ఇవ్వాలని వచ్చామని తెలిపారు. మీరు ఆనందంగా కనిపిస్తేనే మాకు ఇవ్వాలనిపిస్తుంది కదా.. లేదా వైసీపీ వాళ్లు ఉంటే బాగుండు.. వాళ్లేమీ చేయరు.. వీళ్చొచ్చి రోడ్లు, గీడ్లు వేస్తున్నారని బాధగా ఉందా అని చమత్కరించారు. మీరు ఆనందంగా ఉండాలనే అన్ని పథకాలు మహిళలను ఉద్దేశించే చంద్రబాబు తీసుకొచ్చారని తెలిపారు. దీపావళికి ఉచిత సిలిండర్ పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. దీపావళి అయిన మరుసటి రోజే ఉచిత బస్సు ప్రయాణం వస్తుందని అన్నారు.
పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇదే విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా గురజాల జగన్ మోహన్ ప్రకటించారు. దీపావళికి డబుల్ ధమాకా అంటూ తెలిపారు.