అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చిరంజీవి ( Chiranjeevi ) రాజకీయం వల్ల తీరని నష్టం జరిగిందని, ఇంకా ఆ నష్టాన్ని ప్రజలు మరిచిపోలేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Minister Venugolala Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే నాయకులే రాజకీయ పార్టీలు పెడుతారని, తమ కాపు సామాజిక వర్గం కోసం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారని ఆరోపించారు.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం (Prajarajyam) పార్టీని కాంగ్రెస్ లో కలపడం వల్ల రాష్ట్రం రెండు ముక్కలయ్యిందని అన్నారు. ఏపీకి తీరని నష్టం జరిగిందని, ఇప్పటికి సమాన వాటాలు దక్కలేదని ఆయన అన్నారు. చిరంజీవి వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని భావించామని అందుకు విరుద్ధంగా రాజకీయ వ్యవహారం కొనసాగుతుందని దుయ్యబట్టారు.
అసహాయ రాజకీయ నాయకుడు పవన్కల్యాణ్
చంద్రబాబు వద్ద ఇన్ని సీట్లు ఇవ్వాలని ధైర్యంగా అడిగే హక్కు లేని అసహాయ రాజకీయ నాయకుడు పవన్కల్యాణ్ అంటూ మండిపడ్డారు. పవన్ వల్ల జనసేన నాయకులు బాధపడుతున్నారని, పొత్తుల కారణంగా ఎక్కడా తమ రాజకీయ భవిష్యత్ నాశనం అవుతుందో నని ఆందోళనలో ఉన్నారని వెల్లడించారు.
జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేసిందే చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటుతో ప్రజాధనం లూటి, కట్టడాలతో కమిషన్లు పొందారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులు పారిపోయారని, టీడీపీకి ఓటు అడిగే నైతిక హక్కులేదని అన్నారు.