Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం విరుచుకుపడ్డారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదిలిరా.. బహిరంగ సభలో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చీరాలలో కరణం బలరాంను మనమే గెలిపిస్తే.. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ మారాడని.. ఆయనంత దుర్మార్గుడిని చూడలేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు కంటే దుర్మార్గుడిని ఈ లోకంలోనే చూడలేదని కరణం బలరాం మండిపడ్డారు. నిజంగానే నువ్వు నన్ను గెలిపించి ఉంటే.. మంగళగిరిలో నీ కొడుకును ఎందుకు గెలిపించలేకపోయావని ఎద్దేవా చేశారు.
ఇంకొల్లు సభలో చంద్రబాబు తనను దుర్మార్గుడిగా అభివర్ణించారని.. తనపై అవాకులు, చవాకులు పేలడం వల్లే తాను మాట్లాడాల్సి వస్తుందని కరణం బలరాం అన్నారు. చంద్రబాబు కంటే దుర్మార్గుడిని ఇంవరకు చూడలేదని విమర్శించారు. నీ చరిత్ర ఏంటో.. నా చరిత్ర ఏందో తేల్చుకుందాం రా అంటూ సవాలు విసిరారు. చంద్రబాబు గురించి మరింత లోతుగా పోదలుచుకోలేదని.. పోతే చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.
2019లో చీరాలకు వెళ్తానని తాను అడగలేదని కరణం బలరాం స్పష్టం చేశారు. నారా లోకేశ్ను కొంతమంది చీరాలలో తిడితే.. తనను చీరాలకు పంపించారని ఆనాటి సందర్భాన్ని వివరించారు. చీరాలలో తనను గెలిపించానని చంద్రబాబు చెబుతున్నాడని.. అంత సత్తా ఉంటే మంగళగిరిలో లోకేశ్ను ఎందుకు గెలిపించలేకపోయావని ప్రశ్నించారు. చంద్రబాబు హద్దులో ఉండి మాట్లాడితే బాగుంటుందని.. ఇంకోసారి తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.