తిరుపతి : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (AP High court CJ)దంపతులు శుక్రవారం తిరుపతిలోని తిరుచానూర్ శ్రీ పద్మావతి(Sri Padmavati) అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice Prashanth Kumar) దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం టీటీడీ జేఈవో వీరబ్రహ్మం జస్టిస్ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్ గోగర్భం జలాశయం వరకు చేరుకున్నది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు.
ఇక టోకెన్ లేని భక్తులకు శ్రీనివాడి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. కాగా, ఏప్రిల్ 6న స్వామివారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.