తిరుమల : తిరుమల పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిరుతల సంచారం కలకలం రేపుతుంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం బోనులో చిక్కిన ఐదో చిరుత (Cheetahs) ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా తిరుమలలోని స్పెషల్ టైప్ కాటేజీ (Special Type Cottage) సమీపంలో భక్తులు బస చేసే ప్రాంతంలో చిరుత సంచారం ఆందోళనకు గురిచేస్తుంది. మూడు రోజుల క్రితం ఈవో క్వార్టర్స్ వద్ద కనిపించిన చిరుత, ప్రస్తుతం కాటేజ్ వద్ద కనిపించిన చిరుత ఒకటేనా అనే కోణంలో అటవి అధికారులు(Forest Officials) దర్యాప్తు చేస్తున్నారు.
అలిపిరి (Alipiri ) నడక మార్గంలో మూడు నెలల క్రితం ఓ బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలుడిని వైద్య చికిత్సలు అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అనంతరం 20 రోజుల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు సాయంత్రం అలిపిరి గుండా కుటుంబ సభ్యులతో వెళ్తున్న లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి చంపివేసింది . దీంతో భక్తులు అలిపిరి గుండా వెళ్లలాంటే జంకే పరిస్థితి ఏర్పడింది.
భక్తుల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకుంటుందని భరోసా కల్పించి చిరుతలను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు అటవి అధికారులు, టీటీడీ అధికారులు ఊహించని విధంగా ఐదు చిరుతలు బోనులో చిక్కడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చిరుతల దాడి నుంచి కాపాడుకునేందుకు భక్తులకు కర్రలను అందించిన రోజే చిరుత బోనులో చిక్కడం విశేషం. తిరుమలకు, అలిపిరి మెట్లకు సమీపంలోనే మరికొన్ని చిరుతలు సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించడం కలవరపాటుకు గురిచేస్తుంది.