అమరావతి : నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు(Cheetahs) వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ( Srisailam) ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్థానికులు వణికిపోతున్నారు.
తాజాగా పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో(AEO) ఇంటి వద్ద మంగళవారం తెల్లవారుజామున చిరుత సంచారం కనిపించింది. ఏఈవో ఇంటి ప్రహరి గోడ (Compound wall) పై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లడం అక్కడ నమోదైన సీసీ కెమెరాలో నమోదయ్యింది. అంతకు ముందు పరిసర ఇళ్లవరకు వచ్చిన చిరుత సంచరించినట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది.
కొన్ని రోజుల క్రితం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామం పరిధిలోని రామాలయం ఆలయం సమీపంలో చిరుతపులి జనసంచారంలోకి వచ్చి , ఓ ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కలపై దాడి చేసింది. ఇంటి ఆవరణలోకి వచ్చిన చిరుత కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. ఆలయ ఏఈవో ఫిర్యాదు చేయడంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుత కోసం వేట మొదలు పెట్టారు. స్థానికులు రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు.