అమరావతి : ప్రజల కోసమే 40 ఏండ్ల క్రితం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ 40 ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన ట్విటర్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం కంటే ముందు కొందరికే పరిమితమైన అధికారాన్ని టీడీపీ అన్ని వర్గాలకు పంచిందని గుర్తు చేశారు. టీడీపీ అంటేనే అభివృద్ధి..సంక్షేమం.. సంస్కరణలను గ్రామ స్థాయికి అందించిన ఘనత టీడీపీదని అన్నారు. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా వేడుకలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఎన్ఆర్ఐ అభిమానులను ఉద్దేశించి పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.
ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుందని అన్నారు. పార్టీ స్థాపించిన ముహూర్త బలం అలాంటిందని వివరించారు. పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన దివంగత ఎన్టీఆర్ మార్గదర్శకుడని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ వేడకుల సందర్భగా ట్విటర్లో నారా లోకేశ్ స్పందించారు. 40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఎన్టీఆర్, చంద్రబాబు మన ధైర్యమని.. కార్యకర్తలు మన బలం, పసుపు జెండా మన పవర్ అని అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్. అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు అని ప్రశంసించారు.