అమరావతి : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరగుతున్న టీడీపీ కార్యకర్తల హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. వైసీపీ వర్గీయుల దాడిలో హతమైన జల్లయ్య మృతదేహానికి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం ఎందుకు చేయించారని ప్రశ్నించారు. జరుగుతున్న హత్యాకాండపై ప్రత్యేకకోర్టుతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హంతకులకు మరణశిక్ష విధించాలన్నారు.
“ఆస్పత్రి నుంచి జల్లయ్య మృతదేహం ఎక్కడికి తరలించారో కూడా చెప్పరా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా ఇవ్వరా అని లేఖలో పేర్కొన్నారు. హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అంత్యక్రియలకు వెళ్తున్న టీడీపీ నేతల అరెస్ట్పై చంద్రబాబు మండిపడ్డారు. జల్లయ్య కుటుంబానికి టీడీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థికసాయాన్ని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.