అమరావతి : ఆంధ్రప్రదేశ్ అవలంభిస్తున్న అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పాడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరెంటు సమస్యలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ సమీర్ శర్మకు చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ అవినీతి విధానాలతో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని ఆరోపించారు.
విద్యుత్ సంస్థల పేరిట తెచ్చిన రూ.26 వేల కోట్ల అప్పులు, ఛార్జీల పెంపుతో వచ్చిన రూ. 16 వేల కోట్లను ఏమీ చేశారని ప్రశ్నించారు. విద్యుత్ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ అవినీతి విధానాలే కారణమని అన్నారు. విద్యుత్ కోతలతో పౌల్ట్రీ, ఆక్వా పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని వెల్లడించారు. పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. పీపీఏల రద్దుతో విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని బాబు మండిపడ్డారు.