అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ మీటర్ల వ్యవస్థను చంద్రబాబు తీసుకొచ్చారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. నాడు మీటర్లను తీసుకొచ్చి నేడు వద్దంటూ అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. కేంద్రంతో టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఏపీలో వ్యవసాయానికి ప్రభుత్వం కొత్త మీటర్లను బిగిస్తున్నారు. మరోవైపు మీటర్లు బిగించవద్దని టీడీపీ సహా విపక్షాలు డిమాండ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మీటర్ సిస్టమ్ను ప్రవేశపెట్టలేదని చంద్రబాబుతో చెప్పించగలరా అని సవాల్ విసిరారు. కొత్త మీటర్లను బిగించలేకపోతే విద్యుత్ ను ఆదా చేసుకోలేమని స్పీకర్ వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో ఉన్న లోపాలను తొలగించి రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.