Chandrababu | ఏపీలోని టీడీపీ కార్యాలయాలపై దాడుల పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ అధికారులతో ఫోన్లో సంప్రదించారు.. రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. అండగా ఉండాలని అభ్యర్థించారు. కేంద్ర బలగాలను పంపేందుకు హోంశాఖ సుముఖత వ్యక్తం చేసిందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
అంతకుముందు దాడులపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. దాడుల వివరాలను ఆయన దృష్టికి తెచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి సమాచారం తెలిసిన వెంటనే చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలను అడిగి దాడి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ దాడిలో దెబ్బతిన్న ఫర్నీచర్, నేతల వాహనాలను పరిశీలించారు.
టీడీపీ నేతలు పట్టాభి, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, అశోక్బాబు తదితరులు మంగళగిరి కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.