Chandrababu | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఆరోపిస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖలో జైలులో భద్రతా లోపాలను వివరించారు. సెప్టెంబర్ 11న తనను జైలుకు తీసుకొచ్చిన సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని తెలిపారు. తద్వారా తన ప్రతిష్ఠను మంటగలిపారని, తన భద్రతకు ముప్పు తెచ్చారని పేర్కొన్నారు. అలాగే తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారిందని, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్కు ఓ లేఖ కూడా అందిందని తనకు తెలిసిందని వెల్లడించారు. దీనిపై పోలీసులు, అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదని, ఎలాంటి విచారణా జరపలేదని తెలిపారు.
ఎన్టీపీఎస్ కే సులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫొటోలు తీస్తున్నట్టు తనకు తెలిసిందని పేర్కొన్నారు. జై లుపై ఓ డ్రోన్ కెమెరా సంచరిస్తూ తమ ఫొ టోలు, వీడియోలు తీస్తున్నదని, అయినా జైలు అధికారులు, పోలీసులు దాన్ని అడ్డుకోవడం లే దని ఆరోపించారు. జైల్లోకి గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని తెలిపారు. మొత్తం 2200 మం ది ఖైదీలలో 750 మంది తీవ్ర ఆరోపణలు ఎ దుర్కొంటున్న వారు ఉన్నారని, ఈ పరిస్థితులు తన భద్రతకు ముప్పుగా ఉన్నాయని తెలిపారు. తనను కలిసి వెళ్తున్న కుటుంబ సభ్యుల్ని కూడా డ్రోన్ కెమెరా షూట్ చేసిందని, దీనిని బట్టి తన కుటుంబానికి కూడా ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోద్భలంతో దాడులు జరుగుతున్నాయని, ఈ పరిణామాలతో జైలులో తనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కోరారు.
చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందుకు విచారణకు రాగా.. ‘నాట్ బి ఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తప్పుకొన్నారు. ఏ బెంచ్ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.