అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు కూటమి సభ్యులను మోసం చేస్తున్నారని వైసీపీ మంత్రి రోజా (Minister Roja) ఆరోపించారు. కూటమికి కెటాయించిన సీట్లలోనూ టీడీపీ అభ్యర్థులను దించాలనే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ఇటీవల చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభకు జనాలు రాక వెలవెలబోయిందని, రాష్ట్రంలో మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రానున్నదని జోస్యం చెప్పారు.
కూటమికి అభ్యర్థులు దొరకడం లేదని, జనసేనకు నాయకులు కరువయ్యారని విమర్శించారు. అనామకులను అభ్యర్థులుగా పోటిలో నిలబెట్టే దౌర్బాగ్య స్థితిలో జనసేన ఉందని అన్నారు. కూటమి 2014లో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాను అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని మాట ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఏడుకొండలస్వామికే శఠగోపం పెట్టారని విమర్శించారు. కూటమి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టారని వారి మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.