అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu ) శనివారం విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఇటీవల హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో వాటిపై ష్యూరిటీ, బాండ్ల సమర్పణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్నారు. ముందుగా ఇసుక పాలసీ కేసులో విజయవాడలో సీఐడీ అధికారులకు ష్యూరిటీని సమర్పించిన అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై ష్యూరిటీ ఇచ్చేందుకు కుంచనపల్లి సీఐడీ కార్యాలయం, మద్యం కేసుల్లో గుంటూరు సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు.
ఈ మూడు కేసుల్లో చంద్రబాబు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో బాబును విచారించేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించగా ముందస్తుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన కోర్టు మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు నిచ్చారు. బెయిల్ మంజూరుకు కావాల్సిన ష్యూరిటీలో ఆయా సీఐడీ కార్యాలయాల్లో సమర్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం విజయవాడ, గుంటూరుకు చంద్రబాబు వెళ్లారు. ఆయన వెంట టీడీపీ నాయకులు ఉన్నారు.