హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు సోమవారం సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ మంజూరుచేసే క్రమంలో హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సీఐడీ వాదిస్తున్నది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులోపిటిషన్ దాఖలు చేసింది.
స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పక్కా ఆధారాలున్నాయని సీఐడీ పేర్కొంది. బాబు అవినీతికి ఆధారాలు లేవంటూనే.. ఈ కేసులో ఏసీబీ కోర్టు విచారణలో జోక్యం చేసుకోబోనని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొనడాన్ని సీఐడీ ఎత్తిచూపింది. తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయని పేర్కొంది. ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే బెయిల్ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. తనపై స్కిల్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.