అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖలో సంస్కరణల పేరుతో తెచ్చిన సంక్షోభానికి ప్రభుత్వం తెరదించాలని టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ సర్కార్కు సూచించారు. విద్యావ్యవస్థపై బాధ్యతగా, విద్యను అందించే గురువులపై ప్రభుత్వం గౌరవంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆయన గురువులకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయులపై బోధనేతర పనులతో ఒత్తిడి తెచ్చి విద్యా ప్రమాణాలను నాశనం చేస్తున్నారని, ప్రశ్నించే వారిని అణగదొక్కేస్తుందని ఆరోపించారు. సకాలంలో జీతాలు చెల్లించక అగౌరవ పరుస్తుందని అన్నారు. సమస్యలను ప్రస్తావిస్తే వేధింపులకు గురిచేస్తారా ? సీపీఎస్ రద్దు, పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వాన్ని అడగకూడదాని ప్రశ్నించారు .
పాఠశాలల విలీనం పేరిట విద్యను బాలబాలికలకు దూరం చేస్తుంటే మాట్లాడకూడదా అని నిలదీశారు. పిల్ల లను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులను దైవంగా భావించే సమాజం మనదని గుర్తు చేశారు.