చాదర్ఘాట్, జూలై 5 : వ్యవసాయ ఉత్పత్తుల నుంచి అమ్మకాల వరకు శాస్త్రీయ పద్ధతులు అవలంభించాలని అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకునే చారిత్రాత్మక నిర్ణయాలు మిగతా రాష్ట్రాలకు అనుసరనీయమని పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలో ఉత్పత్తులు, అమ్మకం అయ్యే వరకు పంటల మీద శాస్త్రీయమైన అంచనాలు ఉండాలని ముఖ్యమంత్రి ఆయా శాఖలకు దిశానిర్దేశం చేశారన్నారు. సోమవారం మార్కెట్ చైర్పర్సన్ చీదళ్ల రాధ ఆధ్వర్యంలో మలక్పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రాంగణంలో గల మహబూబ్ మాన్షన్ మార్కెట్లో రూ.35లక్షలతో క్యాంటీన్ భవనం, రూ.5 లక్షలతో ముఖద్వారం, రూ.40 లక్షల వ్యయంతో ఈఈ కార్యాలయాలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్నిరకాల పంటల సాగుకు అనువైన వాతావరణం, నేల ఉందన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, అధునాతన విధానాలను అవలంభించే విధంగా నూతన ఒరవడిని సీఎం సృష్టించారన్నారు. మార్కెటింగ్ శాఖలో వ్యవసాయ ఉత్పత్తులు, అమ్మకాల పై విశ్లేషణ, పరిశోధన చేసేందుకు సరికొత్త విధానాన్ని అనుసరిస్తూ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ ఇంటెలిజెన్స్ వింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీజన్కు ముందే ఈ ప్రత్యేక వింగ్ దేశీయంగా, అంతర్జాతీయంగా పరిశోధన చేసి ప్రతి పంట మీద ఒక కొలమానం చేసుకుని సూచనలను ఇచ్చి ఆ పంటలన పండించినట్లు అయితే రైతుకు డిమాండ్కు తగట్టు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. సీఎం రైతు బాంధవుడని వారు అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి అన్ని విధాల ఆదుకున్నారన్నారు.
రైల్, రోడ్డు, ఎయిర్ కార్గో కనెక్టివిటికీ అనుసంధానం చేసే విధంగా కోహెడలోని మార్కెట్ ను తీర్చిదిద్దుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ నెట్వర్క్కు అనుసంధానం చేసి ఆసియా ఖండంలోని అధునాతన మార్కెట్ ను కోహెడలో నిర్మించాలని ముఖ్యమంత్రి ఆలోచన అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్ నిర్మాణం జరుగుతుందన్నారు. మలక్పేట మార్కెట్ను మరోచోట తరలించాలని, ట్రాఫిక్ సమస్య అధికం ఉండడం వలన షిఫ్టింగ్ చేయాలని తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ ప్రతినిధులు మంత్రులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి ఆజం అలీ, కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్, సభ్యులు రాహుల్, కూకుట్లపల్లి రవి, ఎస్జీఎస్ దామోదర్ పాల్గొన్నారు