తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. యువతను ప్రోత్సహించాలని తాము భావిస్తున్నామని, పార్టీ కోసం యువత ముందుకు వచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేరని ఎవ్వరూ భయపడవద్దని, సమాజ హితం కోసం, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని భావిస్తున్న వారు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. సంపదను సృష్టించడంలో టీడీపీ ఎప్పుడూ ముందే వుంటుందని, ఈ శక్తి ద్వారా ఏపీ పునర్నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు.
టీడీపీ ఎక్కడున్నా… తెలుగువారి సంక్షేమమే కోరుతుందని, తెలుగువారి సంక్షేమమే తమ పరమావధి అని చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలువైపులా చాటిన ఘనత ఎన్టీఆర్దేనని పునరుద్ఘాటించారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.