ఢిల్లీలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తీరని అవమానం ఎదురైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు సొంత పార్టీ ఎంపీ నుంచి అవమానం ఎదురవడంతో.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబును స్వాగతం పలికేందుకు ఆయన పార్టీకే చెందిన ఎంపీ నిరాకరించినట్లుగా తెలుస్తున్నది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహణకు సంబంధించిన చర్చల్లో పాల్గొనాల్సిందిగా కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం ఢిల్లీ వెళ్లారు. అయితే, ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని నాని సుముఖత చూపలేదని సమాచారం. పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు నిరాకరించి చంద్రబాబును ఎంపీ కేశినేని నాని అవమానించినట్లు తెలిసింది. చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించాలని మరో ఎంపీ గల్లా జయదేవ్ కోరినప్పటికీ కేశినేని నాని పెద్దగా పట్టించుకోలేదని అక్కడికి వచ్చిన వారు చెప్తుండటం విశేషం. కేశినేని నాని తీరుతో చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఇటీవల కుటుంబంలో తలెత్తిన గొడవల్లో కేశినేని నాని సోదరుడికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబుతో కేశినేని నాని వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తన సోదరుడికి చంద్రబాబు మద్దతు ఇవ్వడంపై కేశినేని నాని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికేందుకు కేశినేని నాని నిరాకరించినట్లుగా ఇక్కడి టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.