Chandra Babu on Jagan |ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సీఎం వైఎస్ జగన్ పూర్తిగా మూర్ఖత్వంతో ముందుకు పోతున్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో గురువారం చంద్రబాబు మంగళవారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది సమస్య అని స్పష్టం చేశారు. ఏదైనా అంశంపై హైకోర్టులో న్యాయం జరుగలేదని భావిస్తే, సుప్రీంకోర్టుకు వెళ్లాలని గుర్తు చేశారు.
హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాబోతున్నదని తెలిసే వైఎస్ జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసిందని చంద్రబాబు మండి పడ్డారు. రాజ్యాంగ వ్యవస్థల్ని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందన్నారు. మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.
కోర్టు తీర్పులపై మాట్లాడిన సీఎంను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికల్లో జడ్జిల గురించి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే హద్దులు మీరి మాట్లాడుతున్నారన్నారు. కోర్టు ఎటువంటి తీర్పులు ఇవ్వవద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని చెప్పారు.
ఇష్ట ప్రకారం చట్టాలు చేసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు తీసే చట్టాలు చేస్తామంటే కోర్టులు ఒప్పుకోవన్నారు. తమ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే అసెంబ్లీలో సీఆర్డీఏ చట్టం చేసిందని చెప్పారు.