విజయవాడ: ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సీపీఎస్ ఎప్లాంయిస్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంర్ 1 న ‘ఛలో విజయవాడ’కు సంఘం నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని తమ దరికి తెచ్చుకుని డిమాండ్లు సాధించుకోవాలంటే పోరాటం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మరో దఫా చర్చలకు సిద్ధం కావాలని మంత్రులు సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలకు సూచించారు. అయితే, మరో ధఫా చర్చలు ఎప్పుడనేది వారు స్పష్టం చేయకపోవడం విశేషం.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుపై ఉద్యోగుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలంగా ముగిశాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు సమావేశమై సీపీఎస్పై చర్చించారు. సీపీఎస్ రద్దుకు తమకు అభ్యంతరం లేదని, దాని స్థానంలో జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీం) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు చెప్పడంతో ఉద్యోగుల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల ప్రతిపాదనలను యూనియన్ తిరస్కరించింది. సీపీఎస్ రద్దుపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు మంత్రులను ప్రశ్నించారు. బేషరతుగా సీపీఎస్ను రద్దు చేయాలని యూనియన్ నేతలు మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
ఇలాఉండగా, ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సెప్టెంబర్ 1 న ఛలో విజయవాడకు ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. చర్చల అనంతరం అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. సీపీఎస్పై చర్చలు విఫలమవడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే సీపీఎస్ రద్దు కావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1 న ఛలో విజయవాడతోపాటు ఛలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. కాగా, సెప్టెంబర్ 1న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు అసోసియేషన్ నేతలకు విజ్ఞప్తి చేశారు.