అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన రెండున్నర ఏండ్లలో శాంతి భద్రతల పరిరక్షణకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఆరో బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీ పోలీసు వ్యవస్థలో డిజిటల్ మార్పులు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. పోలీసు వ్యవస్థను ప్రజల దగ్గర చేర్చేందుకు కృషి చేశానని వెల్లడించారు. డీజీపీగా కొనసాగించిన ఏపీ సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
డీజీపీగా పనిచేసిన సమయంలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. ఏపీ మొబైల్ సేవా యాప్నకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బాధితులు స్టేషన్కు రాకుండానే దిశ, మొబైల్ యాప్ల నుంచి వచ్చిన ఫిర్యాదులకు స్పందించి ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్షను విధించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నూతన డీజీపీ రవీంద్రనాథ్రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.