అమరావతి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందని వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఈ రోజు రాజ్యసభలో ప్రత్యేకహోదా గురించి మాట్లాడారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి బీజేపీ చెబుతున్న ఆరు కారణాలు అర్థం లేనివని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రాన్ని చాలాసార్లు అడిగినా కేంద్రం మొండివైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు.
నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, నేటి రాజ్యసభ చైర్మన్, నాటి ప్రతిపక్ష నాయుడు వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజిత రాష్ట్రాలు రాజధానిని, మెట్రో సిటీలను కోల్పోలేదని, ఆంధ్ర మాత్రమే అన్నింటిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిస్సా, బీహార్లకు ఇచ్చిన ప్రత్యేక గ్రాంట్లను ఇచ్చిన విధంగానే తమకు ఇవ్వాలని కోరారు.