అమరావతి : మిగ్జాం తుఫాన్ (Migjam cyclone) ప్రభావంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో కేంద్ర బృందం (Central Team ) బుధవారం పర్యటించింది. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను రాజేంద్ర రత్నూ నేతృత్వంలో బృందంలోని సభ్యులు పరిశీలించారు. కంకిపాడు మండల కేంద్రంలో పంట నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
దావులూరులో నష్టపోయిన పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడు రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ కేంద్రం ఆదేశాల మేరకు ఏపీలో తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించామని వివరించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పంట నష్టం అంచనాను నివేదిక రూపంలో తయారుచేసి కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. ఇచ్చే నివేదికను కేంద్రం పరిశీలించి పంట నష్టపరిహారాన్ని ప్రకటిస్తుందని వెల్లడించారు.