శ్రీశైలం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి వచ్చారు. ఆలయ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమిత్ షా కుటుంబ సభ్యులు భ్రమరాంబ అతిథి గృహంలో మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.