Election Commission | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని జూన్ 4న ఓట్ల కౌంటింగ్ ప్రశాంత వాతావరణం జరిగేలా చూడాలని సూచించింది. కౌంటింగ్పై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నది.
సీఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు జరిగేలా చూడాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఫలితాలను వేగంగా, ఖచ్చితత్వంతో ఫలితాలను ప్రకటించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా, పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాగ్చితో పాటు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు వీసీలో పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించొద్దని స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టం, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక ఘటనలు జరుగకుండా చూడాలని పోలీసు అధికారులను స్పష్టం చేసింది. పల్నాడుతో పాటు పలు ప్రాంతాల్లోని హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కౌంటింగ్ విషయంలో సూచనలు చేసింది.