అమరావతి : ప్రధాని మోదీ పాలనలో కేంద్రం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రాలకు కోట్ల నిధులు కేటాయించామని ఆమె వెల్లడించారు. మంగళగిరి ఎయిమ్స్కు కేంద్రం రూ. 1618 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రజాసేవ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు.
కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చినా ప్రజలకు సక్రమంగా చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు కనీసం ప్రధాని ఫొటో కూడా ఎక్కడా ముద్రించకపోవడం బాధకరమని అన్నారు. కేంద్ర సహకారంతో నడిచే పథకాలకు మోదీ బొమ్మ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర పథకాలతో ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు.
కేంద్ర నిధులను రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో 99 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించారు. వ్యాక్సినేషన్ విజయవంతం చేసిన ఏపీ సర్కార్కు అభినందనలు తెలిపారు.