అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో అనుమానితులందరినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ (67వ రోజు) పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహంలో ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్ రెడ్డితోపాటు పులివెందులలోని చెప్పుల దుకాణం యజమాని మున్నాను సైతం సీబీఐ ప్రశ్నించింది. సురేంద్ర నాథ్ రెడ్డి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నారు.
ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు సమాచారం. కర్ణాటక నంచి 20 మందికిపైగా బ్యాంకు, రెవెన్యూ అధికారులు పులివెందులకు వచ్చి పూర్తిస్థాయిలో సీబీఐకి వివరాలు అందించినట్లు తెలిసింది. వివేకానందరెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు.. భూముల వ్యవహారాలు ఇలా ప్రతీ అంశంపైనా సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు నెలలకుపైగా సాగుతున్న విచారణకు వీలైనంత త్వరగా ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో సీబీఐ ఉంది.